పద్మారావునగర్ లో కిలేడి హల్చల్.. అమాయక వ్యక్తిని బురిడి కొట్టించి డబ్బుల స్వాహా..
పద్మారావునగర్ లో కిలేడి హల్చల్..
అమాయక వ్యక్తిని బురిడి కొట్టించి డబ్బుల స్వాహా..
సికింద్రాబాద్, ఏప్రిల్ 03 ( ప్రజామంటలు ) :
ఓ కిలేడి లేడి బస్టాండ్ లో పరిచయం చేసుకున్న వ్యక్తిని బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు గుంజుతున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. చిలకలగూడ పోలీసుల కథనం ప్రకారం....పద్మారావునగర్ కు చెందిన కృష్ణన్ దక్షిణా మూర్తి (61) అనే ప్రైవేట్ ఎంప్లాయి గత నెలలో డ్యూటీ ముగించుకొని సికింద్రాబాద్ రేతిఫైల్ బస్టాండ్ లో ఇంటికి వెళ్ళేందుకు బస్సు కోసం వేయిట్ చేస్తుండగా, ఓ గుర్తు తెలియని మహిళ తనకు తాను దక్షిణామూర్తి దగ్గరికి వెళ్ళి తాను వెళ్ళే బస్సు వివరాలు అడుగుతూ, తన పర్సనల్ వివరాలు చెప్పింది.
పద్మారావునగర్ కు వెళ్ళే బస్సు రాగానే అందులో వెళ్ళేందుకు దక్షిణామూర్తి ప్రయత్నించగా, అడ్డుకున్న ఆమె రూ 5వేలు ఇవ్వాలని డబ్బులు డిమాండ్ చేసింది. అందుకు నిరాకరించిన ఆయన బస్సు ఎక్కగా, ఆయన వెంటే బస్సు ఎక్కిన ఆమె పద్మారావునగర్ బస్టాప్ దిగి, డబ్బులను ఇవ్వమని తిరిగి డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కేసు పెడతానని, పోలీసు అధికారులు తనకు పరిచయమని భయపెట్టింది.
దాంతో బాధితుడు దగ్గర లోని ఏటీఎమ్ లోకి వెళ్ళి రూ 10 వేలు డ్రా చేయగా, ఆ డబ్బులను లాక్కోని వెళ్ళింది. తిరిగి వారం తర్వాత కిలేడి బాధితుడి ఇంటికి వెళ్ళి అతడి భార్య ను బ్లాక్ మెయిల్ చేసి, డబ్బులు డిమాండ్ చేసింది. ఇలా పలు మార్లు బాధితుడి ఇంటికి వెళ్ళిన కిలేడి వేధింపులు భరించలేక బాధితుడు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించాడు. సదరు లేడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పోలీసులు విచారణ జరిపి కిలేడి ఆచూకి గుర్తించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, నోటీసులను అందచేశారు. సదరు కిలేడి పేరు అరుణ అలియాస్ భాగ్య గా గుర్తించిన పోలీసులు ఆమె పలు చోట్ల ఇలాగే అమాయకులను బురిడీ కొట్టించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు మహిళ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిలకలగూడ పోలీసులు సూచించారు.
–––––––––––
–ఫొటో: