అనంత లోకాల్లోకి దూసుకెళ్లిన ధ్రువతార – రామోజీ రావు   తెలుగు పత్రికారంగానికి చిరస్మరణీయుడు

On
అనంత లోకాల్లోకి దూసుకెళ్లిన ధ్రువతార – రామోజీ రావు   తెలుగు పత్రికారంగానికి చిరస్మరణీయుడు

అనంత లోకాల్లోకి దూసుకెళ్లిన ధ్రువతార – రామోజీ రావు  
తెలుగు పత్రికారంగానికి చిరస్మరణీయుడు

హైదరాబాద్ జూన్ 09:

తెలుగు పత్రికా రంగాన దృవతారగా వెలిగిన చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు, ఈ ప్రపంచాన తన యాత్ర ముగించుకొని, ఆయన నమ్మే ఆపై లోకాలకో, స్వర్గానికో మారెక్కడికో ఎగిరిపోయాడు. ఆయన మృతికి  తెలంగాణ జాతీయ దినపత్రిక “ప్రజా మంటలు” కుటుంబం, రామోజీ రావు కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతుంది.

 

సరిగ్గా యాబై ఏళ్ల క్రితం, మొన్నటి వార్తలను మధ్యాహ్నానికి మోసుకొచ్చే తెలుగు పత్రికలకు పోటీగా, ఉదయం ఆరు గంటలకే ఇంటి ముంగిట తాజా వార్తల సమాహారాన్ని అందించే పత్రికగా, ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖపట్నంలో తాను ప్రారంభించిన “ఈనాడు” దినపత్రిక ద్వారా ప్రపంచానికి పరిచయమైన రామోజీ రావు, నాలుగైదేళ్ల తరువాత హైదరాబాద్ కు తన మఖాం మార్చి, పత్రికారంగానికి ఉషోదయం కల్పించాడు.  తెలుగు భాష అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన రామోజీరావు, సమగ్ర తెలుగు నిఘంటువు రూపకల్పనకు చేస్తున్న ప్రయత్నం ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లు లేదు.

 

పత్రికా రంగాననే కాకుండా సినిమా రంగంలో కూడా నూతనోత్సాహాన్ని నింపే కొత్త కథలకు, కథనాలకు, యువకులకు ప్రత్సాహం అందించిన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి రామోజీరావు. మయూరి, ప్రతిధ్వని, చిత్రం లాంటి వైవిధ్యమైన కథాంశాలతో చిత్రాలను నిర్మించారు. తెలంగాణ పోరాట చరిత్రను, ఆనాటి నిజాం పాలంలోని పైశాచికత్వాన్ని తెలిపే “విముక్తి కోసం” లాంటి సినిమాలను పంపిణీ చేసిన రామోజీ రావు సినిమారంగానికి ఎనలేని సేవలు అందించారు.  

 

తెలుగు పత్రికా భాషను మార్చి, కొత్త పదాలకు, కొత్త సొగసులకు  రూపం దిద్దాడు.  పత్రికా విలేఖరులకు శిక్షణ ఇస్తూ, భాష పై పట్టు ఎలా సాధించాలో నేర్పిన సంస్థ ఈనాడు అధినేత. పత్రికారంగంలో వచ్చిన ప్రతి మార్పును స్వాగతిస్తూ, జిల్లా కేంద్రాన్ని ప్రచురణ కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని, జిల్లా వార్తలకు ప్రత్యేక సంచికను అందించే సరికొత్త ప్రయోగం చేసి, గ్రామీణ, రాజకీయ, సామాజిక వార్తల ప్రాధాన్యాన్ని పెంచి, సామాన్య ప్రజలకు కూడా పత్రికను దగ్గర చేశాడు.

 

పెట్టుబడిదారు రాజకీయాలను ప్రోత్సహించినా, పత్రిక నిండా వామపక్ష భావాలు నిండిన మేధావులకు పెద్ద పేట వేశారు. వామ పక్ష పార్టీల వార్తలకు అంత ప్రాధాన్యత ఇవ్వకున్నా, మేధావులకు ఆశ్రయం ఇస్తూ, ఆ తరువాతి కాలంలో వచ్చిన అనేక పత్రికలకు సంపాదకులను అందించిన కర్మాగారం ఈనాడు అని గుర్తుచేసుకోక తప్పదు. ఈనాడు గొప్పగా చెప్పుకొంటున్న అనేక మంది పాత్రికేయులు, ఇక్కడి నుండి వచ్చిన వారే.

 

రాజకీయంగా ఆయన ఆలోచనలు ఎలా ఉన్నా, తెలుగు రాష్ట్రాలలో బహు విధమైన పరిశ్రమలను స్థాపించడంలో, వేలాది మందికి ఉపాధి కల్పించడంలో, ఇటీవలి కాలంలో రామోజీరావు ను మించిన వ్యక్తి లేదనడం అతిశయోక్తి కాదు. ప్రపంచంలోనే ఎంతో కీర్తి గడించిన “రామోజీ ఫిల్మ్ సిటీ” నిర్మాణ ఆలోచన తెలుగు వారందరినీ గర్వించే లా చేసింది. రాజకీయ కారణాలతో ఎన్ని సమస్యలు వచ్చినా, తన ఆలోచనలను అమలు చేసి, హైదరాబాద్ కే  కాకుండా, దేశానికే గర్వకారణమైన “రామోజీ ఫిల్మ్ సిటీ” నిర్మించి, నిర్వహించడం ఎంతో గొప్ప విషయం.

 

దేశంలో అప్పుడప్పుడే టివి రంగం విస్తరిస్తున్న తరుణంలో ఈటీవీ ని ప్రారంభించి, 16 భాషలలొ విస్తరించిన ఘనుడు. టి వి రంగానికి పోటీగా వస్తున్న డిజిటల్ వ్యవస్థను కూడా అందిపుచ్చుకొని ఈటీవీ డిజిటల్, ఈటీవీ భారత్ లతో పాటు, ఈటీవీ విన్ మొబైల్ ఆప్ లాంటి మీడియా సంస్థలతో ప్రపంచ తెలుగు ప్రజలకు తెలుగు భాషను, నూడికారాన్ని అందిస్తూ, దేశంలోని అన్నీ ప్రాంతాల వార్తలను ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్న మొనగాడుగా చెప్పుకోవాలి. లాంటి మహానుభావుడు ఈనాడు భౌతికంగా దూరం అయినా, ఆయన ఆలోచనలు ఎప్పుడు తెలుగు వారితోనే ఉంటాయి.

    

Tags