తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి
గోల్కొండ కోటలో ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు
శూన్యం నుంచి ఉన్నత శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాను - సీఎం రేవంత్
హైదరాబాద్ ఆగస్ట్ 15 (ప్రజా మంటలు):
రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భారాన్ని అధిగమించి ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టే వరకు విశ్రమించబోమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
“మనసుంటే మార్గం ఉంటుందన్న సూక్తిని బలంగా విశ్వస్తాను. మాకు సంకల్పం ఉంది. అందుకు అవసరమైన విజన్ ఉంది. ఆర్థిక భారం ఉన్నప్పటికీ శూన్యం నుంచి ఉన్నత శిఖరానికి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నాం. ప్రజల అండతో లక్ష్యం చేరుకునే వరకు విశ్రమించం..” అని గోల్కొండ వేదికగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు.
79 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గోల్కొండ రాణిమహల్ లాన్స్లో ముఖ్యమంత్రి వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. తెలంగాణ రాష్ట్ర గీతాలాపన, సమ్మాన్ గార్డ్స్ కవాతు అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజు నుంచి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో పాటు తెలంగాణ సమగ్రాభివృద్ధికి భవిష్యత్తు ప్రణాళికను ఆవిష్కరించారు. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టాలన్న లక్ష్య సాధన కోసం పనిచేద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
“అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. ప్రజలు, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా విధాన నిర్ణయాలు తీసుకున్నాం. రైతులు, మహిళలు, యువత భవితకు పెద్దపీట వేశాం. సామాజిక తెలంగాణ ఆవిష్కరణకు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాం. కుల గణనతో బలహీన వర్గాల వందేళ్ల కలను నిజం చేశాం. ఎస్సీ వర్గీకరణతో దశాబ్దాల నిరీక్షణకు తెరదించాం.
అభివృద్ధి, సంక్షేమం అన్న ద్విముఖ విధానంతో ప్రభుత్వం పాలన సాగిస్తోంది. అందరినీ కలుపుకుని అద్భుతాలు సృష్టించే సమ్మిళిత అభివృద్ధి విధానాన్ని ప్రజా ప్రభుత్వం ఎంచుకుంది. పరిపాలనలో పారదర్శకత, అభివృద్ధిలో ఆధునికత, సంక్షేమంలో సరికొత్త చరిత్రను రాస్తూ 20 నెలల కాలంలో తెలంగాణను దేశానికి రోల్ మాడల్గా నిలబెట్టాం.
ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి 8,21,651 కోట్ల అప్పులు, బకాయిలు ఉండగా, అందులో 6,71,757 కోట్ల అప్పు.. ఉద్యోగులు, ఇతర పథకాలకు సంబంధించిన బకాయిలు 40,154 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, సింగరేణి, విద్యుత్, ఇతర విభాగాలకు చెల్లించాల్సిన బకాయిలు 1,09,740 కోట్లు ఉండగా, వాటిపై అసలు రూపేణా 1,32,498 కోట్లు, వడ్డీ రూపేణా 88,178 కోట్లు మొత్తం కలిపి 2,20,676 కోట్ల రూపాయల డెట్ సర్వీసింగ్ చేసాం.
13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం
పేద ప్రజల ఆహార భద్రతకు భరోసాగా ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని ప్రారంభించాం. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేపట్టాం. నిరుపేదల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే పథకంతో పేదల కళ్లలో కనిపించిన ఆనందం, ఆత్మగౌరవం శాశ్వతంగా గుర్తుంటుంది. అలాగే ఈ ఏడాది జూలై నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం.
వరంగల్ వేదికగా 2022 మే 6 న ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో 25.35 లక్షల మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కొత్త చరిత్ర సృష్టించాం. రైతుల విషయంలో ప్రభుత్వం రాజీ పడదు. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 12 వేల చొప్పున జూన్ 16 న కేవలం 9 రోజుల్లో 9 వేల కోట్ల పెట్టుబడి సాయం అందించాం. దేశంలోనే అత్యధిక పంట పండించే దిశగా తెలంగాణ రైతాంగాన్ని ప్రోత్సహించాం.
రాష్ట్ర వ్యాప్తంగా 7,178 కొనుగోలు కేంద్రాల ద్వారా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేశాం. సన్నాలకు క్వింటాలుకు రూ. 500 బోనస్ ఇస్తున్నాం. రాష్ట్రంలో 29 లక్షల పంపుసెట్లకు 16,691 కోట్ల సబ్సిడీతో ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. ఇవన్నీ రైతుల పట్ల, వ్యవసాయం పట్ల ప్రజా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగరాసి అన్నదాతల సంక్షేమానికి రూ. 1 లక్ష 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేశాం.
పేదల సొంతింటి కలను నెరవేర్చడానికి తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం 22,500 కోట్లను వెచ్చిస్తున్నాం.
ఫిబ్రవరి 4 వ తేదీని తెలంగాణ సోషల్ జస్టిస్ డే
ఎంతో శ్రమకోర్చి శాస్త్రీయమైన, ఎంతో లోతైన కసరత్తు చేసి సామాజిక తెలంగాణ సాధన కోసం స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభ ద్వారా ఆమోదించాం. ఆ బిల్లులను కేంద్ర ప్రభుత్వం సత్వరం ఆమోదించాలని కోరుతున్నాం. అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. సామాజిక తెలంగాణకు పునాది వేసిన రోజు ఫిబ్రవరి 4 వ తేదీని తెలంగాణ సోషల్ జస్టిస్ డే గా జరుపుకోవాలని నిర్ణయించాం.
రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న ప్రభుత్వం కోటి మంది కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అత్యంత పారదర్శకతతో, వివాదరహితంగా వివిధ పరీక్షలు నిర్వహించి 60 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగ అవకాశాలను కల్పించాం. యువత మాదక ద్రవ్యాల భారిన పడి జీవితాలను నాశనం చేసుకోకుండా వాటిని కఠినంగా అణిచి వేస్తున్నాం.
చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే ప్రణాళికలతో ప్రాజెక్టులకు లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు వెళుతున్నాం. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్ర వాటాల సాధనలో రాజీ పడబోం. హైదరాబాద్లో హైడ్రాను ఏర్పాటు చేసిన తర్వాత 13 పార్కులను, 20 చెరువులను ఆక్రమణల నుంచి రక్షించింది. 30 వేల కోట్ల విలువ కలిగిన ప్రభుత్వ భూములను కాపాడగలిగింది.
హైదరాబాద్ లో అంతర్జాతీయ ఈవెంట్లు నిర్వహించాలి
తెలంగాణ బలం హైదరాబాద్. ఆ బలాన్ని మరింత బ్రాండింగ్ చేయడానికి పలు అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించాం. మిస్ వరల్డ్, వరల్డ్ గ్లోబల్ ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ సదస్సు, గ్లోబల్ రైస్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు వంటివి నిర్వహించాం. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ను గమ్యస్థానంగా మార్చుకుంటున్నాం.
శాంతి భద్రతలు రాష్ట్ర ప్రగతికి కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణ అనేక అంతర్జాతీయ సదస్సులకు వేదికగా నిలిచి అత్యంత ప్రశాంత నగరంగా గుర్తింపు పొందుతుందంటే అందుకు మన పోలీసు వ్యవస్థ కారణం. వారికి అభినందనలు. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ది బెస్ట్ అనే పేరుంది.
తెలంగాణ రైజింగ్ 2047
అన్ని వేదికల నుంచి తెలంగాణ విజన్ను ప్రపంచానికి పరిచయం చేశాం. తెలంగాణ రైజింగ్ 2047 (Telangana Rising 2047) విజన్ డాక్యుమెంట్ను ఈ ఏడాది డిసెంబర్ లో ఆవిష్కరించబోతున్నాం. దేశ స్వాతంత్య్రం సిద్ధించి శత వసంతాలు పూర్తి చేసుకుంటున్న 2047 నాటికి తెలంగాణను ప్రపంచంలో నెంబర్ వన్గా నిలబెట్టాలన్న విజన్తో నిరంతరం శ్రమిస్తున్నాం.
భారతదేశ ముఖచిత్రాన్ని మార్చే గేమ్ ఛేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్నదే మా సంకల్పం. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు నుంచి తెలంగాణ గ్రామీణ వ్యవసాయ వికాసం వరకు విజన్లో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించాం.
రీజినల్ రింగ్ రోడ్డు, గ్రీన్ ఫీల్డ్ హైవేలు, డ్రైపోర్టు, మెట్రో విస్తరణ, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డును కలిపే రేడియల్ రోడ్లు, వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటు వంటి లక్ష్యాలతో తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే ప్రణాళికే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్.
ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలు
తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలు పోషించే పాత్ర అద్వితీయంగా ఉంటుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు దేశ విద్యా రంగంలో గేమ్ ఛేంజర్లు కావడం ఖాయం.
శూన్యం నుంచి దేశ ప్రయాణం మొదలైంది. ఉన్నత శిఖరాలే లక్ష్యంగా మన పెద్దలు ఈ దేశాన్ని ముందుకు నడిపించారు. ఈరోజు మనం చూస్తున్న ఆధునిక భారతం వెనుక 79 ఏళ్ల కఠోర శ్రమ, ఎందరో గొప్ప నాయకుల త్యాగం, చెమట, రక్తం ఉంది. ఈ విజయ ప్రస్థానంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మనం రుణపడి ఉండాలి.
వారందించిన విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడం మనందరి కర్తవ్యం. ఆ బాధ్యతను నిర్వర్తించడంలో, ఆ స్ఫూర్తితో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది” అని ముఖ్యమంత్రి వివరించారు.
రాహుల్ సిప్లిగంజ్ కు 1 కోటి రూపాయల ప్రోత్సహక చెక్కు
ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, డీజీపీ జితేందర్ తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు ఈ సందర్భంగా 1 కోటి రూపాయల ప్రోత్సహక చెక్కును ముఖ్యమంత్రి అందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఆర్డీవో కార్యాలయం లో ఘనంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

క్యాంప్ ఆఫీస్, జెడ్పి కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్

జిల్లా పోలీస్ కార్యాలయం లో ఘణంగా 79 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు. దేశ సేవకు పునరంకితం కావాలి: జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్
.jpg)
రేపు అమెరికా కు కల్వకుంట్ల కవిత
.jpg)
ఆనాటి నేతల త్యాగాల ఫలితంగానే మనకు ఈనాడు స్వేఛ్చ వాయువులు - కోట నీలిమా

వర్షకొండ లోని అక్షర భారతి కాన్వెంట్ స్కూల్ నందు ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

మెట్ పల్లి కోర్టు కాంప్లెక్స్ లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

సర్దార్ సర్వాయి పాపన్న375 వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవాలి

వర్షకొండ లో జడ్.పి.హెచ్.ఎస్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

టీఎస్ జేయు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.

తెలంగాణను నెంబర్ వన్గా నిలబెట్టే వరకు విశ్రమించబోను - సీఎం రేవంత్ రెడ్డి

300 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగా ర్యాలీ
