ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు
జగిత్యాల ఏప్రిల్ 15 (ప్రజామంటలు): ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాలలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యాంసాని సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల 11 నెల 18 రోజులు, సుదీర్ఘకాలం పాటు అనేక దేశాలు ప్రయాణించి, దేశానికి అవసరమైన అంశాలను దాదాపు 1000 సంవత్సరాలకు సరిపడ దూరదృష్టితో రాజ్యాంగాన్ని రచించారని, అనేక పుస్తకాలను రచించి అంటరానితనాన్ని పార ద్రోలారని పేర్కొన్నారు. పేదరికంతో పుట్టడం మన దురదృష్టం కాదు. పేదవాడిగా మరణించడం మాత్రం కచ్చితంగా దురదృష్టం అని, కులం పునాదుల మీద ఒక జాతిని గాని, దేశాన్ని గాని నిర్మించలేమని అంబేద్కర్ పేర్కొన్నారని,అంబేద్కర్ యొక్క ఆశయాలను నిలబెడుతూ, ఆదర్శాలతో వారి మార్గంలో నడిచి, దేశానికి సేవ చేయాలని ఎన్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వృక్షశాస్త్ర విభాగాధిపతి జి. చంద్రయ్య మాట్లాడుతూ.... ప్రపంచంలోనే అత్యధిక విగ్రహాలు, దేశంలోనే అతిపెద్ద విగ్రహం అంబేద్కర్ దని, రాజ్యాంగమే మనందరికీ అత్యున్నతమైన పుస్తకం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ వేముల జమున, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.