మహిళను వేధించిన ఆటో డ్రైవర్ కు వారం రోజుల జైలు శిక్ష
మహిళను వేధించిన ఆటో డ్రైవర్ కు వారం రోజుల జైలు శిక్ష
సికింద్రాబాద్ ఏప్రిల్ 15 ( ప్రజామంటలు): ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, వేధించిన ఓ ఆటోడ్రైవర్ కు వారం రోజుల శిక్ష పడిరది. చిలకలగూడ ఎస్.ఐ. పి. కిషోర్ కథనం ప్రకారం.... పద్మారావునగర్ కు చెందిన ఓ మహిళ గత నెల 27న రాత్రి 11.30 గంటలకు ఆఫీస్ లో డ్యూటీ ముగించుకొని, క్యాబ్ లో పద్మారావునగర్ కు వచ్చి, ఇంటికి నడుచుకుంటూ వెళ్ళుతుండగా, వెనక నుంచి వచ్చిన తుకారం గేట్ కు చెందిన షేక్ నదీమ్ అలీ (22) ఆటో డ్రైవర్ ఆమె ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్య కరంగా ప్రవర్తించాడు. ఆమె పక్క నుంచే ఆటోను తీసుకెళ్ళుతూ, అక్కడి నుంచి పరారీ అయ్యాడు. వెంటనే అప్రమత్తమైన మహిళ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోయింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఎంక్వైరీ చేసి తుకారం గేట్ కు చెందిన ఆటో డ్రైవర్ షేక్ నదీమ్ అలీ గా గుర్తించారు. కేసు నమోదు చేసి సోమవారం సికింద్రాబాద్ 15వ స్పెషల్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జడ్జీ ఎదుట నిందితుడిని ప్రవేశపెట్టారు. నిందితుడికి వారం రోజుల శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు ఎస్.ఐ వివరించారు. ఈసందర్బంగా చిలకలగూడ పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. రోడ్డుపై నడిచేటప్పుడు వెనక వచ్చే వాహనాలను గమనించాలని, దుండగులు అసభ్యంగా ప్రవర్తించడం, చైన్ స్నాచింగ్ లకు పాల్పడే అవకాశం ఉందన్నారు. రోడ్డుకు కుడివైపున నడవాలన్నారు. పద్మారావునగర్ లో నివాసం ఉంటే మెడికో గర్ల్స్ రాత్రుళ్ళు తమ ఇంటికి వెళ్ళే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. రాత్రుళ్ళు రోడ్డుపై నడిచేటప్పుడు చేతిలో మొబైల్ ఫోన్లు, విలువైన వస్తువులు పట్టుకొని వెళ్ళకూడదన్నారు. అలాగే విలువైన గోల్డ్ ఆర్నమెంట్స్ ధరించవద్దన్నారు. ఇండ్ల ముందు తెల్లవారుజామున క్లీన్ చేసే మహిళలు స్ట్రీట్ లో వచ్చే వెహికిల్స్ ను పరిశీలించాలని కోరారు. ఎమర్జెన్సీ సమయంలో 100 నెంబర్ కు డయల్ చేయాలని ఎస్.ఐ పి. కిషోర్ సూచించారు.